విజయవాడ, మార్చి 11 : ప్రధాని కావాలనే ఆలోచనతో కేసీఆర్ కొత్త ఫ్రంట్ తెరపైకి తీసుకువస్తున్నారని.. అది నిలదొక్కుకోవడం కష్టమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న పీసీసీ ఛీఫ్ రఘువీరాకు పలువురు నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నికలు జరిగితే చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని, చంద్రబాబు ఎన్డీఏతో తెగదెంపులు చేసుకుంటారన్న ఉద్దేశంతో కేసీఆర్ ముందుగానే థర్డ్ ఫ్రంట్ తెరపైకి తెచ్చారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే రాజ్యసభ ఎన్నిక బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ప్రజలను మభ్యపెట్టకుండా రాష్ట్రంలో తెదేపా, వైకాపా, కాంగ్రెస్, వామపక్షాలు అన్ని ఒకే తాటిపైకి వచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకువద్దామని పిలుపునిచ్చారు.