లఖ్నవూ, మార్చి 11 : ఉత్తర ప్రదేశ్, బిహార్లో ఉప ఎన్నికల పోలింగ్ సాఫీగా జరుగుతుంది. యూపీలోని రెండు లోక్ సభ స్థానాలకు, బిహార్లోని అరారియా లోక్సభ స్థానంతోపాటు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ఆరంభమైంది. యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ గోరఖ్పూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం యోగి(గోరఖ్పూర్), డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య(ఫుల్పూర్) రాజీనామా చేయడంతో ఈ లోక్సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల కోసం యూపీలో బద్దశత్రువులైన ఎస్పీ- బీఎస్పీ కలిసి బరిలోకి దిగాయి. మరో వైపు బీహార్ లో మహాకూటమిని వీడి కమలం పార్టీ మద్దతుతో తిరిగి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన అనంతరం నితీశ్ కుమార్ ప్రభుత్వం తొలిసారిగా ఉప ఎన్నికలను ఎదుర్కొంటోంది. అరారియా లోక్సభతోపాటు జెహనాబాద్, భాభువా అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు మార్చి 14న ఫలితాలు వెలువడనున్నాయి.