తిరుపతి, జూన్ 28 : తిరుపతి కొండకు వచ్చే భక్తుల తాకిడి ఎక్కువవుతున్నందున శీఘ్ర దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థాన నిర్వాహకులు గతంలో దివ్యదర్శనం పేరుతో ప్రత్యేక టోకెన్లను జారీ చేస్తూ వచ్చారు. కాని కాలినడకన వచ్చే భక్తులు లెక్కకు మించి రావడంతో దీనిని రద్దు చేయాలని తితిదే పాలకమండలి భావిస్తుంది. ప్రతిరోజూ సాధారణ భక్తుల సంఖ్య పెరగడంతో వారు 10-12 గంటలు క్యూ లో ఉండాల్సి రావడంతో, దివ్య దర్శనం ద్వారా వెళ్ళే భక్తులు 2-6 గంటల వ్యవధిలోనే వెలుపలికి వస్తున్నారు. దీనితో దివ్యదర్శనానికి వెళ్ళే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అలిపిరి, శ్రీవారి నడక మార్గాలలో వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువవుతుంది. ముఖ్యంగా వారాంతాల్లో కొండపైకి నడిచి వచ్చే వారి సంఖ్య 35,000 ఉండడంతో దివ్యదర్శనం టికెట్లను వాటితో పాటు ఉచిత లడ్డూలను నిలిపివేయాలని, తితిదే కమిటీ సభ్యులు నిర్ణయించారు. ముందుగా శుక్ర, శని, ఆది వారాల్లో వీటిని రద్దు చేస్తామని జేఈవో శ్రీనివాసరాజు పేర్కొన్నారు. ఇది జూలై 7 వ తేదీ నుంచి అమలవుతుందని, భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. తితిదే తీసుకున్నఈ నిర్ణయంపై భక్తులు తిరుపతి కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.