హైదరాబాద్, మార్చి9 : ముఖ్యమంత్రి కేసీఆర్ మాటే నా బాట అని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తోన్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విధంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు చెప్పారు. తన పుట్టుక.. చావు కూడా తెరాసలోనేనని స్పష్టంచేశారు. ఉద్యమంలో త్యాగాలు చేసిన కుటుంబం నుంచి తాను వచ్చానన్నారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను సమర్థంగా నిర్వహిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే ప్రజల్లో స్పందన ఎలా వస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదనే విషయం ఆ పార్టీ నాయకులకు తెలుసన్నారు. కాంగ్రెస్ హయంలో విద్యుత్ కోతలు ఉంటే.. తెరాస హయాంలో విద్యుత్ సౌకర్యంగా మారిందని తెలిపారు. తెరాస ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పెండింగ్ ప్రాజెక్టులుగా మారిస్తే.. తాము రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని తెలిపారు.