పాల్గఢ్, మార్చి 9: మహారాష్ట్ర పాల్గఢ్లోని రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 13 మంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. పేలుడు శబ్దం కంపెనీ నుండి దాదాపు పది కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని, ఇళ్లు, భవనాలు కంపించాయని పోలీసులు వెల్లడించారు. రామేదేవ్ కెమికల్ ప్లాంట్లోని బాయిలర్ గదిలో ఈ భారీ పేలుడు సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రసాయన కర్మాగారం పక్కన ఉన్న ఇతర కంపెనీలకు కూడా మంటలు విస్తరించాయని, ఈ కంపెనీల్లో రసాయనాలతో కూడిన డ్రమ్ములు ఉండడం వల్ల మంటలు విస్తరిస్తున్నాయని పాల్గఢ్ ఎస్పీ మంజునాథ్ తెలిపారు.