హైదరాబాద్, మార్చి 8 : ఈరోజు పేపర్ చూసి షాక్ కి గురయ్యానని, రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు రాజీనామా వార్త విన్న కేటీఆర్.. స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు అందించిన సేవలు అభినందనీయం. నేడు ఈ వింగ్స్ ఇండియా సదస్సుకు ముఖ్య అతిథిగా రావాల్సిన ఆయన.. ఇక్కడకు హాజరుకాకపోవడంతో నేను ముఖ్య అతిథిగా వ్యవహరించాల్సి వచ్చింది" అంటూ పేర్కొన్నారు. గడిచిన 70 ఏళ్లలో 70 విమానాశ్రయాలు ఉంటే.. కేవలం అశోక్ గజపతి రాజు సారథ్యంలో గడిచిన మూడేళ్లలో 50 నుంచి 60కిపైగా కొత్త విమానాశ్రయాలు ఏర్పాటయ్యాయని వెల్లడించారు.