హైదరాబాద్, మార్చి 7 : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏప్రిల్ 29న గొల్ల, కురుమల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బహిరంగ సభ యాదవ సంఘం ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన మంత్రి.. “గొల్ల, కురుమ ప్రభంజనం” పేరిట పది లక్షల మందితో సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుండి ముఖ్య నేతలంతా జిల్లాల్లో, మండలాల్లో పర్యటించి సన్నాహక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అలాగే వచ్చే నెల మొదటి వారంలో తాను కూడా జిల్లాల్లో పర్యటిస్తానని పేర్కొన్నారు. బహిరంగ సభకు రావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తామని తలసాని తెలిపారు.