చంద్రగిరి, మార్చి 7 : మహిళా సాధికారత కోసం దక్షిణ మధ్య రైల్వే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి రైల్వేస్టేషన్ ను పూర్తిస్థాయి మహిళా రైల్వేస్టేషన్గా మార్చేసింది. దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్కుమార్ యాదవ్ అధికారికంగా ఈ స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం చంద్రగిరిని మహిళా రైల్వేస్టేషన్గా ప్రకటించిందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని బేగంపేట రైల్వేస్టేషన్ను సైతం ఈ విభాగంలో ఎంపిక చేశామన్నారు. దేశంలో మొదటి మహిళా రైల్వేస్టేషన్లుగా ముంబై, మధ్యప్రదేశ్లోని మాతంగి రైల్వేస్టేషన్ లను గుర్తించినట్లు వెల్లడించారు. అయితే ఇక్కడి కార్యకలాపాల నిర్వహణ మొత్తం మహిళలే నిర్వహించడం విశేషం.