కొలంబో, మార్చి 7 : భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న ముక్కోణపు టోర్నీ తొలి మ్యాచ్ లో భారత్ పరాజయం పాలైంది. 5 వికెట్ల తేడాతో శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్తో ఓపెనర్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సార్లు డకౌటైన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ అగ్రస్థానంలో నిలిచాడు. మొదటి ఓవర్లో చమీరా వేసిన నాలుగో బంతిని తన బ్యాట్ తో బాదిన రోహిత్.. జీవన్ మెండీస్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో తొలి మ్యాచ్ లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. గతేడాది టీ20లో శతకం సాధించి రికార్డు సృష్టించిన రోహిత్.. నేడు డకౌట్గా వెనుదిరగడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత్ తరుపున ఇన్నిసార్లు ఏ ఆటగాడు డకౌట్ అవ్వలేదు. ఇప్పటి వరకు 75 టీ-ట్వంటీలు ఆడిన రోహిత్.. 68 ఇన్నింగ్స్ల్లో ఐదు సార్లు డకౌటయ్యాడు. ఆశిష్నెహ్రా(3), యూసుఫ్ పఠాన్(3), గౌతం గంభీర్(2), రవీంద్ర జడేజా(2) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.