ముంబై, మార్చి 7 : పిచ్చి పరాకాష్టకు చేరడం అంటే ఏంటో ఈ సంఘటనను చూస్తే అర్ధమవుతుంది. తన అభిమాన నటుడిపై ఉన్న మమకారంతో చివరికి తన యావదాస్తిని అతని పేరిట రాసి ఆమె తనువు చాలించింది. ఆ అభిమాన నటుడు మరెవరో కాదు సంజయ్ దత్. ముంబైకి చెందిన నిషి త్రిపాఠి అనే మహిళకు సంజయ్ దత్ అంటే అమితాభిమానం. కాని ఆమె అనారోగ్యంతో జనవరిలో మృతి చెందింది. చనిపోవడానికి ముందు ఆమె తన ఆస్తి మొత్తాన్ని తన అభిమాన నటుడు సంజయ్ పేరున రాసి౦ది. ఇదిలా ఉండగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి "నిషి చనిపోయే ముందు తన ఆస్తిని మీ పేరిట బ్యాంక్లో డిపాజిట్ చేసింది" అని బ్యాంక్ అధికారులు సంజయ్ దత్కు ఫోన్ చేసి చెప్పడంతో షాక్కు గురయ్యాడు. ఈ విషయం నిషి కుటుంబ సభ్యులకు బ్యాంకు అధికారులు చెప్పే వరకు తెలీదట. దీంతో వారి కుటుంబం నుండి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సంజయ్ ముందు జాగ్రత్తగా.. తన తరఫు వకీలు చేత బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఒక లేఖ రాయించారు. నిషి తన పేరిట డిపాజిట్ చేసిన డబ్బుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై సంజయ్.. "నిషి ఎవరో నాకు తెలియదు. ఆమె నా పేరుతో రాసిన ఆస్తులన్ని వారి కుటుంబానికే చెందాలి. అందుకే నా వంతు ప్రయత్నం చేస్తున్నా" అంటూ వివరణ ఇచ్చారు.