అమరావతి, మార్చి 6 : ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుండి అన్ని అంశాల్లో ఒక స్పష్టత వచ్చే వరకు పోరాటం ఆపవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన.. పార్టీ ఎంపీలు, తెలుగుదేశం సమన్వయకమిటీ సభ్యులతో నేటి ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన హామీలన్ని రావాల్సిందేనని, వచ్చే వరకు పోరాటం ఆపవద్దని ఎంపీలకు సూచించారు. అనుకున్నవి సాధించుకునే వరకు మన వైఖరిలో మార్పు లేదని తేల్చి చెప్పారు. అనంతరం ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ.. జైట్లీతో జరిపిన సమావేశ వివరాలను చంద్రబాబుకు వివరించారు. సమావేశానికి అమిత్ షా హాజరుకాకపోవడంతో మిగిలిన చర్చను వాయిదా వేసినట్లు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.