సెంచూరియన్, మార్చి 3 : ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో టీమిండియా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. సఫారీలతో టెస్ట్, వన్డే, టీ-20 సిరీస్ లో పాల్గొన్న కోహ్లి సేన టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత ప్రత్యర్ధికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా అప్రతిహత విజయాలను సాధించింది. దీంతో వన్డే సిరీస్ ను టీమిండియా 5-1తో, టీ-20ని 2-1తో దక్కించుకొని సగర్వంగా స్వదేశంలో అడుగుపెట్టింది. కాగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య సెంచూరియన్లో జరిగిన రెండో టీ20ని అభిమానులు రికార్డు స్థాయిలో వీక్షించారట. తాజాగా ఓ సర్వే ప్రకటించిన ఫలితాల్లో ఈ మ్యాచ్ ప్రథమ స్థానంలో నిలిచింది. మూడు టీ-20 ల సిరీస్ లో భాగంగా ఫిబ్రవరి 21న జరిగిన రెండో టీ-20 మ్యాచ్ లో ప్రోటీస్ జట్టు ఇండియా పై విజయం సాధించి సిరీస్ ను 1-1 తో సమం చేసింది. తొలి మ్యాచ్ లో భారత్ జట్టు విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. సఫారీ గడ్డపై కోహ్లీ సేన ఆడిన అన్ని మ్యాచ్ల కంటే ఈ మ్యాచ్కు 25శాతం వీక్షకుల సంఖ్య ఎక్కువగా నమోదైందని సర్వే వెల్లడించింది.