హైదరాబాద్, మార్చి 3 : రోజురోజుకి పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను అదుపు చేసే దిశగా నగర ట్రాఫిక్ పోలీసు శాఖ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రహదారులపై ప్రమాదాలు, మరణాలు తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు అన్నారు. ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్ మాత్రమే కాకుండా ఎడ్యుకేషన్గా పిలిచే పలు కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు, ఉల్లంఘనలకు పాల్పడితే సంభవించే నష్టాలను వివరిస్తూ రూపొందించిన పాటల సీడీని సీపీ ట్రాఫిక్ చీఫ్ వి.రవీందర్తో కలిసి ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతిక సారథి, భాషా–సాంస్కృతిక శాఖతో కలిసి రూపొందించిన ఈ ఆరు పాటలూ ట్రాఫిక్ నిబంధనలపై వారికి అవగాహన కలిగించి ప్రాణం విలువ తెలుసేట్టుగా చేస్తాయని ఆయన అన్నారు.