సంగారెడ్డి, మార్చి 2 : ఆర్టీసీ బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా సమీపంలోని కంది ఐఐటీ క్యాంపస్ వద్ద చోటు చేసుకుంది. జహీరాబాద్ నుంచి పటాన్ చెరు వెళ్తున్న బస్సు వేగంగా వెళ్తూ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. దీంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లగా అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. అంతేకాకుండా బస్సులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మృతులు సంగారెడ్డికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.