లఖ్నవూ, మార్చి 2 : సాధారణంగా పోలీస్ శాఖలో విధులు నిర్వహించే వ్యక్తులపై తీవ్రంగా ఒత్తిడి ఉంటుంది. 24 గంటలు పాటు ప్రజా సంరక్షణలో భాగంగా ఏ క్షణమైనా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుంది. తాజాగా ఓ పోలీస్ కానిస్టేబుల్ తన కుమార్తె మరణించిదని తెలిసిన విధి నిర్వహణకే తలవంచారు. హృదయంలో అంతటి వేదనను భరించి ప్రమాదంలో ఉన్న పౌరున్ని రక్షించారు. వివరాల్లోకి వెళితే... ఉత్తర్ప్రదేశ్కు చెందిన 57ఏళ్ల భూపేంద్ర తోమర్ రాష్ట్ర పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 23న రాత్రి 9 గంటల సమయంలో భూపేంద్ర, మరికొందరు పోలీసులు సహరాన్పూర్లో సాధారణ తనిఖీలు చేస్తుండగా.. వారికి ఓ ఎమర్జెన్సీ ఫోన్కాల్ వచ్చింది. బదాగావ్ ప్రాంతంలో ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు కత్తితో దాడి చేశారని.. వెంటనే రావాలనేది ఆ ఫోన్ సారాంశం. దీంతో అక్కడ నుండి హుటాహుటిన బయలుదేరిన బృందం కు మార్గ మధ్యలో భూపేంద్రకు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. తన 27ఏళ్ల కుమార్తె జ్యోతి ప్రమాదవశాత్తు మరణించిదని భూపేంద్రకు కుటుంబసభ్యులు ఫోన్ చేసి చెప్పడంతో ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. సహచరులు కారు వెనక్కి తిప్పి ఇంటికి వెళ్దామని చెప్పిన కర్తవ్యం ముందు అని చెప్పిన భూపేంద్ర ఇంటికి వెళ్లకుండా ఘటనాస్థలానికే వెళ్దామని చెప్పారు. భూపేంద్ర బృందం అక్కడికి చేరుకొని కోనఊపిరితో ఉన్న యువకుడిని ఆసుప్రతికి తరలించారు. భూపేంద్ర బృందం అక్కడికి చేరుకునే సరికి ఆ యువకుడి రక్తపుమడుగులో కొనఊపిరితో కన్పించాడు. వెంటనే అతడిని ఆసుప్రతికి తరలించారు. దీంతో ఆ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత భూపేంద్ర ఇంటికి వెళ్లారు. కన్న కూతురి మరణ వార్త విని కూడా డ్యూటీ నిర్వహించిన భూపేంద్రను ఉన్నతాధికారులు అభినందించారు.