అమరావతి, మార్చి 2 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహనాన్ని కేంద్రం పరీక్షిస్తోందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య, బీజేపీ భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో తెదేపా ఎంపీలు సమావేశమయ్యారు. ఆ వివరాలను చంద్రబాబుకు వివరించేందుకు ఎంపీలంతా అమరావతి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. "చంద్రబాబు సహనాన్ని కేంద్రం పరీక్షిస్తోంది. కేంద్రంపై ఎంత ఒత్తిడి చేసినా భిక్షం వేసినట్లు ఇస్తారే తప్ప అక్కడ జరిగేదేమి ఉండదు. ఉప రాష్ట్రపతి చొరవ తీసుకొని ప్రయత్నించి చూస్తే ఫలితం ఉండొచ్చు. కేంద్రానికి పోయేదేమీ ఉండదు. ఏప్రిల్లో రాజీనామాలు చేసినా ఉప ఎన్నికలు రావని తెలిసే ప్రతిపక్ష నేత జగన్ నాటకం ఆడుతున్నాడు. సభ్యుల మద్దతు కూడగట్టడంలో జగన్ చిత్తశుద్ధి చూపించడం లేదు" అంటూ వెల్లడించారు.