గన్ఫౌండ్రి, మార్చి 2 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాట్లాడిన మాటలు అటు బీజేపీ కార్యకర్తలతో పాటు ఇటు దేశ ప్రజలను సైతం బాధపెట్టాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. బీజేపీ మాజీ జాతీయాధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ వర్ధంతి హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతుండగా అక్కడకు హాజరైన మంత్రి మాట్లాడారు. కేసీఆర్ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలా మాట్లాడడం సరికాదన్నారు. ప్రధాని పట్ల ఆయన ఏకవచనంతో చేసిన వ్యాఖ్యలు సరైన పద్ధతి కాదన్నారు. ఆదిభట్లలో బోయింగ్-టాటా కంపెనీ కార్యక్రమానికి హాజరుకావడానికి ముందే మంత్రి కేటీఆర్తో ఫోన్లో మాట్లాడానని, ఈకార్యక్రమానికి రావడం బాగుండదని అన్నట్లు నిర్మలాసీతారామన్ తెలిపారు. కేసీఆర్ మాట్లాడిన మాటలపై కేటీఆర్ను నిలదీశాను. అసలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలా? వద్దా? అని ప్రశ్నించానని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పంది౦చిన కేటీఆర్.. మా నాన్న ఇలా మాట్లాడతారని నేను అసలు ఊహించలేదన్నట్లు తెలిపారు. ఒకవేళ కేసీఆర్ నోరుజారీ ఉంటే వివరణ ఇచ్చి ఉంటే బాగుండేదని వెల్లడించారు.