భూపాలపల్లి, మర్చి 2 : తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. అంతేకాకుండా ఆ ప్రమాదం జరిగిన స్థలం నుండి తుపాకులు, స్కానర్, ల్యాప్ట్యాప్ తో పాటు రూ. 41 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూజారికాంకేడు ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతంలో భద్రత దళాలు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడగా ఒకరిపై ఒకరు కాల్పుల మోత మోగించారు. ఈ ఘటనలో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందగా మిగిలిన వారు పరారయ్యారు. ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ కానిస్టేబుల్ను హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ, ఓఎస్డీ హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి బయలుదేరారు. వెంకటాపురం ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఎక్కువ కావడంతో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించారు.