హరారే, మార్చి 2 : బండ్లు ఓడలు అవుతాయి..ఓడలు బండ్లు అవుతాయి అంటే ఇదేనేమో.. వెస్ట్ ఇండీస్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈ దేశ జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అలాంటి మేటి జట్టు ప్రపంచ కప్ బరిలోకి దిగడానికి పసికూనలతో పోరాడవల్సిన పరిస్థితి. రెండు సార్లు ప్రపంచ కప్ విజేతగా, ఒకసారి రన్నరప్గా నిలిచిన కరేబియన్ జట్టు ఇప్పుడు తొలిసారి నేరుగా ప్రపంచకప్నకు అర్హత సాధించలేకపోయింది. విండీస్ జట్టు ఆదివారం హరారే వేదికగా ఆరంభమయ్యే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ టోర్నీలో పాల్గొనబోతోంది. సాధారణంగా ప్రపంచకప్లో 10 కంటే ఎక్కువ జట్లు ఆడతాయి. 2007లో 16, 2011, 2015 టోర్నీల్లో 14 జట్లు పాల్గొన్నాయి. మారిన ఐసీసీ నిబంధనల ప్రకారం ఈసారి టోర్నీలో 10 జట్లే బరిలోకి దిగుతున్నాయి. ఆతిథ్య హోదాలో ఇంగ్లాండ్తో పాటు ర్యాంకింగ్ ప్రకారం టాప్-7 జట్లు నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన రెండు బెర్తుల కోసం ఇప్పుడు అర్హత టోర్నీ జరుగుతోంది. 10 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడుతున్న ఈ టోర్నీలో విండీస్ గ్రూప్-ఎలో ఉంది. ఈ నెల 6న తన తొలి మ్యాచ్లో యూఏఈతో తలపడనుంది.