ముంబై, ఫిబ్రవరి 28 : వెండితెరను శాసించిన అందం ఇక లేదు. ఆ అతిలోక సుందరి ఇక తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. తమ అభిమాన నటిని శ్రీదేవిను కడసారి చూసుకునేందుకు తారాలోకం, అభిమాన జనం భారీగా తరలివచ్చారు. అశేష జనవాహిని మధ్య అశ్రునయనాలతో శ్రీదేవి అంత్యక్రియలు ముంబయిలోని విల్లే పార్లే సమాజ్ సేవా హిందూ శ్మశాన వాటికలో ముగిశాయి. దాదాపు 7 కి.మీల మేర సాగిన అంతిమయాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీదేవికి మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇందులో భాగంగా గౌరవ సూచకంగా ఆమె పార్థివ దేహానికి త్రివర్ణ పతాకం చుట్టారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కుటుంబసభ్యులు, సినీప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య "ఇక సెలవు" అంటూ శ్రీదేవి తరలివెళ్ళిపోయారు.