హైదరాబాద్, ఫిబ్రవరి 27 : నిరుద్యోగుల కలను నిజం చేస్తూ భారతీయ రైల్వేశాఖ ప్రపంచంలోనే అతిపెద్ద కొలువు మేళాకు తెరతీసింది. రైల్వేశాఖ మొత్తం 89,409 గ్రూపు సీ, డీ స్థాయి ఉద్యోగాలకు ఇటీవల ప్రకటన జారీ చేసింది. అంతే కాకుండా విద్యార్హతలను తగ్గించడంతో పాటు, పెంచిన రుసుమును తిరిగి అభ్యర్ధులకు తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఎక్కువ మందికి అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో అభ్యర్ధుల వయోపరిమితిని రెండేళ్లు పెంచింది. తాజాగా ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అసిస్టెంట్ లోక్ పైలట్, టెక్నీషియన్ ఉద్యోగాలకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 28 నుంచి 30 ఏళ్లకు, ఓబీసీలకు 31 నుంచి 33కు, ఎస్సీ, ఎస్టీలకు 33 నుంచి 35 ఏళ్లకు పొడిగించారు. గ్రూపు డి ఉద్యోగాలకు అన్ రిజర్వుడ్(జనరల్) అభ్యర్థులకు 31 నుంచి 33, ఓబీసీలకు 34 నుంచి 36, ఎస్సీ, ఎస్టీలకు 36 నుంచి 38కి పెంచినట్లు బోర్డు వెల్లడించింది.