హైదరాబాద్, ఫిబ్రవరి 23 : కొత్త పాసుపుస్తకాల పంపిణీపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో పాసు పుస్తకాల తయారీ పక్కాగా జరిగిన తర్వాతే పంపిణీ చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. పాసు పుస్తకానికి ఆధార్ కార్డు నంబరును కచ్చితంగా అనుసంధానం చేయాలని స్పష్టంచేశారు. ఆధార్ నంబర్ లేని భూములను బినామీలుగా గుర్తించాల్సి వస్తుందని అన్నారు. పాసు పుస్తకాల్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలు నమోదు చేయాలని అధికారులను సూచించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళనను పూర్తిచేసి రెవెన్యూ అధికారులు క్లిష్టమైన పనిని శ్రమకోర్చి విజయవంతం చేశారని ప్రశంసించారు.