హైదరాబాద్, ఫిబ్రవరి 20 : డిజిటల్ యుగంలో ప్రపంచం త్వరితగతిన పురోగమిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. భాగ్యనగరంలో నాస్కామ్, విట్సా, తెలంగాణ ప్రభుత్వం కలిసికట్టుగా నిర్వహిస్తున్న 22వ ప్రపంచ ఐటీ సదస్సును (డబ్ల్యూఐసీటీ) మోదీ ప్రారంభించారు. భారత్ లో తొలిసారిగా ఈ సదస్సును నిర్వహించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మూడు రోజులపాటు కొనసాగనున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో కృత్రిమ మేధస్సు, ఉద్భవిస్తున్న పరిజ్ఞానాలపై మొదటి రోజు విస్తృత చర్చ జరిగింది. ఐటీ కాంగ్రెస్ రెండవ రోజు సదస్సులో భాగంగా నేడు "సోఫియా" అనే రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రపంచంలో ఒక దేశానికి పౌరసత్వం ఉన్న ఏకైక రోబో ఇదే కావడం విశేషం. ఈ రోబో నేడు జరగనున్న ఐటీ సదస్సులో "మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్తు" అనే అంశంపై ప్రసంగించనుంది. అలాగే నేటి సదస్సులో కృత్రిమ మేధస్సు, నూతన టెక్నాలజీపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన టీ ఫైబర్గ్రిడ్ ఇంటర్నెట్ సేవలను తెలంగాణ ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.