న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 : కమలం పార్టీకి మిత్రపక్షమైన నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్) వీడ్కోలు చెప్పేందుకు సిద్దమైంది. ఈ మేరకు మణిపూర్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్పీఎఫ్ తన మద్ధతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించుకోగా.. బీజేపీ ప్రభుత్వంలో గుబులు మొదలైంది. ‘త్వరలోనే ఈ నిర్ణయాన్ని ప్రజల సమక్షంలో ప్రకటిస్తాం’అని ఆదివారం ఎన్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మురంగ్ ముకంగా ప్రకటించారు. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉండగా.. బీజేపీకి 31 మంది ఎమ్మెల్యేలు(వీరిలో 9 మంది కాంగ్రెస్ నుంచి, ఒకరు ఏఐటీసీ నుంచి ఫిరాయించిన వారు), ఎన్పీఎఫ్ తరపున నలుగురు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్ధతు ఇస్తున్నారు. ఈ పరిస్థితులలో ఎన్పీఎఫ్ గనుక మద్ధతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. ఫిబ్రవరి 27 నాగాలాండ్ ఎన్నికల సమరం అనంతరం బీజేపీతో తెగదెంపులపై ఎన్పీఎఫ్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.