చిత్తూరు, ఫిబ్రవరి 19: నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే కలెక్టర్ ప్రద్యుమ్నను కలిసి తన నియోజక వర్గ పరిధిలోని సమస్యలపై చర్చించారు. నగరి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి పెద్దమనసుతో అంగీకరించినందుకు ఆమె కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. నగరి ఆస్పత్రికి వెళ్ళే రహదారి అంశం గత 15 సంవత్సరాలుగా సమస్యగా ఉండగా స్థానిక రాజకీయాల నేపథ్యంలో రహదారిని మరోవైపుకు తిప్పడం వల్ల వాస్తు దోషంతో ఇద్దరి ప్రాణాలు కోల్పోయారన్నారు. దీంతో పాత పద్ధతిలో పాతరోడ్డుకే అనుమతిస్తానని కలెక్టర్ చెప్పడంతో ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఆస్పత్రిలో వైద్యం వికటించి మరణించిన చింతల పట్టెడ నివాసి పార్థసారధి భార్యకు రూ.4 లక్షల నష్టపరిహారంలో జాప్యం విషయంలో సానుకూలంగా స్పందించడంతో ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.