ఫిబ్రవరి 18 : దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన కోహ్లి సేన టెస్ట్ సిరీస్ ను 2-1 తో కోల్పోయినప్పటికి సిరీస్ ఆసాంతం టీమిండియా బౌలర్లు మంచి ప్రదర్శన కనబర్చారు. అదే ఊపులో ఉన్న భారత్ జట్టు ఆరు వన్డేల సిరీస్ లో ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా 5-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. కెప్టెన్ కోహ్లి తన బ్యాటింగ్ తో జట్టుకు ఒంటిచేత్తో విజయాలను అందిస్తున్నాడు. మరో వైపు బౌలింగ్ విభాగంలో స్పిన్ ద్వయం చాహల్, కులదీప్ యాదవ్ సఫారీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో మూడు టీ-20 ల సిరీస్ పోరు కోసం సిద్దమయ్యింది. టీ-20 కోసం సీనియర్ బ్యాట్స్ మెన్ సురేశ్ రైనా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరో వైపు ఆతిధ్య జట్టు ఈ సిరీస్ నెగ్గి పరువు నిలుపుకోవాలని భావిస్తుంది. ప్రోటిస్ జట్టుకు జేపీ డుమిని సారథ్యం వహిస్తుండగా, మూడు వన్డేలలో తనదైన మార్క్ చూపించలేని ఏబీ డివీలియర్స్ ఈ సారి రెచ్చిపోవాలని చూస్తున్నాడు. ముగ్గురు కొత్త ఆటగాళ్లు.. వికెట్కీపర్ క్లాసన్, జొంకర్, జూనియర్ దలా జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశముంది. ఓవర్లో ఫలితాలు తారుమారై టీ-20 సమరం మధ్య పోరు రసవత్తరంగా సాగడం ఖాయం.