హైదరాబాద్, జూన్ 25 : వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా పార్టీ మారతారంటూ గత కొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ.. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదిలిపెట్టబోనని రోజా స్పష్టం చేశారు. తాను టీడీపీ నుంచి వైసీపీలోకి రాగానే జగన్ తనను ఎమ్మెల్యేని చేశారని రోజా అన్నారు. జగన్ తనను తన సోదరి అని చెప్పుకుంటున్నారని, జగన్ కి తాను జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె తెలిపారు. ఏపీలో తాగుడును మరింత విస్తరించే ప్రయత్నం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలకి అన్యాయం చేస్తే తమ పార్టీ ఊరుకోదని తెలిపారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళల మాన, ప్రాణాలని కాపాడుతామని రోజా వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్ మందలిచడంతో రోజా మనస్థాపం చెందారని, దీంతో ఆమె జనసేనలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు రావడం తప్ప. అలాంటి ఉద్దేశం తమకు లేదని అది అవాస్తవం అని రోజా వెల్లడించారు.