ముంబై, ఫిబ్రవరి 16 : పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఏకంగా రూ. 11,400 కుచ్చు టోపీ పెట్టారు. భారతదేశ చరిత్రలో అతి పెద్ద బ్యాంకు కుంభకోణంగా పేర్కొంటున్న ఈ కేసులో గురువారం ఈడీ అధిక మొత్తంలో ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. కేసులో ప్రధాన సూత్రధారుడైన బిలియనీర్, ఆభరణాల డిజైనర్ నీరవ్ మోదీకి చెందిన దుకాణాలు, ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించి రూ. 5,100 కోట్ల విలువైన వజ్రాలు, ఆభరణాలు, బంగారాన్ని సీజ్ చేసింది. తను మోసం గుట్టు బయటపడుతుందని ముందే తెలిసిందో ఏమో... నీరవ్ మోదీ తో సహా ఈ కేసుతో సంబంధమున్నఆయన మేనమామ మెహుల్ చోక్సి, సోదరుడు నిశాల్, భార్య అమీ , జనవరిలోనే విదేశాలకు చెక్కేశారు. కాగా ఈ ఘటనపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీని.. కాంగ్రెస్ ‘చోటా మోదీ’గా అభివర్ణించింది. దీంతో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. వేల కోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో పాత్ర ఉన్న వారు ఎంత పెద్దవారైనా దర్యాప్తు సంస్థలు వదిలిపెట్టబోవని భాజపా వెల్లడించింది.