నాకౌట్‌ దశకు చేరుకున్న ఆంధ్ర, హైదరాబాద్..

SMTV Desk 2018-02-15 17:03:32  vijay hazare trophy, andhra, hyderabad, knock out,

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15 : విజయ్‌ హజారే ట్రోఫీ లో ఆంధ్ర, హైదరాబాద్ జట్లు నాకౌట్‌ దశకు చేరుకున్నాయి. బుధవారం జింఖానా మైదానంలో జరిగిన గ్రూపు-డి చివరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 84 పరుగుల ఆధిక్యంతో చత్తీస్‌గఢ్‌పై జయభేరి మోగించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ జట్టులో సందీప్‌ (79) హాఫ్‌ సెంచరీకి కెప్టెన్‌ రాయుడు (46), రవితేజ (45) రాణించారు. దీంతో రాయుడు సేన నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధన ఆరంభించిన చత్తీస్‌గఢ్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (5/37) దెబ్బకు 44.3 ఓవర్లలో 199 పరుగులకే ఆలౌటైంది. గ్రూప్‌-సిలో వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ నెగ్గి అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్ర కూడా నాకౌట్‌కు చేరింది. చెన్నైలో బుధవారం జరిగిన గ్రూప్‌ ఆఖరి లీగ్‌లో ఆంధ్ర 29 పరుగులతో ముంబైని ఓడించింది. మరో మ్యాచ్‌లో రంజీ చాంపియన్స్‌ విదర్భను 8 వికెట్లతో కంగుతినిపించిన సౌరాష్ట్ర (16 పాయింట్లు) మెరుగైన రన్‌రేట్‌తో రెండోస్థానంతో నాకౌట్‌లో అడుగుపెట్టింది. ఇంకో మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌ను జార్ఖండ్‌ 97 పరుగులతో చిత్తుగా ఓడించింది. కాగా, క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లు ఈనెల 21 నుంచి ఢిల్లీలో జరగనున్నాయి.