పొచెఫ్స్ట్రూమ్, ఫిబ్రవరి 13 : సౌతాఫ్రికా జట్టుతో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ కు ముందు టీమిండియా మహిళా క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. కాలి గాయం కారణంగా సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి ఏకంగా సిరీస్కే దూరమైంది. ఈ మేరకు బీసీసీఐ మంగవారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపింది. ‘కాలి గాయంతో బాధపడుతోన్న జులన్ గోస్వామికి సోమవారం ఎమ్మారై స్కాన్ చేశాం. గాయం తీవ్రమైందని తేల్చి చెప్పిన వైద్యులు రెండు వారాలు విశ్రాంతి ఉండాలని చెప్పారు. దీంతో ఆమె దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ నుంచి తప్పించాం’ అని బీసీసీఐ ప్రకటనలో వెల్లడించింది. మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ను 2-1తో సొంతం చేసుకున్న భారత్ అదే ఊపుతో టీ20 సిరీస్ను నెగ్గాలని చూస్తుంది. కాగా సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఈ రోజు పొచెఫ్స్ట్రూమ్ లో జరగనుంది.