హైదరాబాద్, ఫిబ్రవరి 10 : హైదరాబాద్ నగర పరిధిలోని హౌసింగ్ బోర్డు స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ నేడు శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్లోని గాంధీనగర్, మారేడుపల్లిలో దాదాపు 800 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. పేదలకు లక్ష రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పేదల ఆత్మగౌరవం కాపాడేందుకే ఇళ్లు నిర్మిస్తున్నామన్న కేటీఆర్.. రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల కోట్ల రూపాయలతో 2 లక్షల 75 వేల ఇళ్లను నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందన్న మంత్రి మొదటిసారి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రజావసరాలను తెలుసుకొనే కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు.