ప్యాంగ్చాంగ్, ఫిబ్రవరి 9 : శీతాకాల ఒలింపిక్స్కు సమయం ఆసన్నమైంది. ఎముకలు కొరికే చలిలో విన్యాసాలకు క్రీడాకారులు సిద్దంగా ఉన్నారు. దక్షిణ కొరియాలోని ప్యాంగ్ చాంగ్లో క్రీడా సంగ్రామం నేటి నుండి ప్రారంభం కానుంది. ప్యాంగ్చాంగ్ ఒలింపిక్ స్టేడియంలో ఆరంభం కానున్న ఈ శీతాకాల ఒలింపిక్స్ అధికారికంగా నేడు ప్రారంభం కానున్నాయి. మొత్తం 92 దేశాలకు చెందిన జట్లు ఈ శీతాకాల ఒలింపిక్స్లో పాల్గొననున్నాయి. 15క్రీడల్లో 102 ఈవెంట్లలో ఈ పోటీలు జరగనున్నాయి. ఇందులో భాగంగా భారత్ నుండి ఇద్దరు శివ్కేశవన్(లుజ్), జగదీష్( క్రాస్కంట్రీ స్కీయింగ్) మాత్రమే ఈ మంచు క్రీడా సంరంభంలో పోటీపడనున్నారు. 10, 11వ తేదీల్లో పురుషుల సింగిల్స్ లుజ్ హీట్స్ జరగనుండగా, 16న 15 కిమీ నోర్దిక్ స్కీయింగ్ ఫ్రీస్టైల్ ఈవెంట్ జరుగుతుంది. ఈ శీతాకాల ఒలింపిక్స్ క్రీడల ప్రత్యక్ష ప్రసారాలను రిలయన్స్ జియో టీవీలో చూడవచ్చు. అలాగే ఐఓసీ వెబ్సైట్ ద్వారా ఒలింపిక్ చానెల్లో, యూట్యూబ్ ఛానెల్లో సైతం ఈ క్రీడలను ప్రసారం చేయనున్నారు. కాగా ఈ నెల 25వ తేదీన ఆటలు ముగియనున్నాయి.