విరాట్ వీర విహారం.. భారత్ ఘన విజయం..

SMTV Desk 2018-02-08 11:15:27  india, south africa, 3 rd odi, kohli century

కేప్ టౌన్, ఫిబ్రవరి 8 : దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత్ సారథి విరాట్ కోహ్లి అద్భుతమైన శతకంతో అలరించాడు. కేప్ టౌన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సహచరుల నుండి మద్దతు లేకపోయినా విరాట్ వీరవీహారం చేశాడు. అంతే కాకుండా టీమిండియా మణికట్టు స్పిన్ ద్వయం చాహల్(46/4), కులదీప్ యాదవ్(26/4) , మరోసారి తమ ప్రతాపం చూపించారు. తొలుత టాస్ నెగ్గిన సఫారీ జట్టు భారత్ కు బ్యాటింగ్ అప్పగించింది. బ్యాటింగ్ లో ఓపెనర్ రోహిత్ శర్మ (0) మరోసారి తన వైఫల్యాన్ని కొనసాగించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి (160) పరుగులతో తన కెరీర్ లో 34 వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు శిఖర్ ధావన్ 76 పరుగులతో రాణించడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 303 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధన ప్రారంభించిన ప్రోటీస్ జట్టు లో డుమిని(51), కెప్టెన్ మర్క్రం (32), తప్ప మిగతా బ్యాట్స్ మెన్ ఎవ్వరు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. మణికట్టు మాంత్రికులు చాహల్, యాదవ్ దెబ్బకు సౌతాఫ్రికా జట్టు 40 ఓవర్లలో 179 పరుగులకే చాపచుట్టేసింది. సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ " మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు" ను దక్కించుకున్నాడు. ఈ విజయంతో ఆరు వన్డేల సిరీస్ లో భాగంగా కోహ్లి సేన 3-0 తో అధ్యికంలో ఉంది. ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే ఈ నెల 10 న జోహాన్స్ బర్గ్ లో జరగనుంది.