న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 : భారత్ క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో జరగుతున్న సిరీస్ లో రెండు వన్డేల్లో విజయం సాధించి మూడో వన్డే సమరంకు సిద్దమయ్యింది. రెండు వన్డేల్లో భారత మణికట్టు స్పిన్ ద్వయం చాహల్, కుల్దీప్ సఫారీలను తమ బంతులతో ఇబ్బంది పెట్టి కోహ్లిసేన విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. సఫారీ బ్యాట్స్మెన్లు ఎందుకు మన మణికట్టు స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారో మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ తెలిపాడు. ‘దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లు మన మణికట్టు స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. సాధన సమయంలో వారు స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్తో బంతులు వేయించుకుంటున్నారు. తాహీర్ మణికట్టు స్పిన్నర్ కాదు కనుకే వారు చాహల్, కుల్దీప్ బౌలింగ్లో ఇబ్బందిపడుతున్నారు. వారు తమ జట్టులో కొన్ని మార్పులు చేస్తే మంచిది’ అని గంగూలీ వ్యాఖ్యానించారు.