అమరావతి, ఫిబ్రవరి 7 : కేంద్రం నుండి ఒక స్పష్టత వచ్చేంత వరకు వెనక్కు తగ్గొద్దని పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్లమెంటులో ఎంపీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీకి జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా చర్చకు తీసుకువస్తామని రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పోరాటం కొనసాగించాలన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చించాలని, విభజన సమస్యలపై సభలో రెండు గంటల పాటు ప్రత్యేక చర్చకు పట్టుబట్టాలని తెలిపారు. రెండు ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఈ సమస్యను వీధి పోరాటాల సమస్య చేయవద్దని హితవు పలికారు. ఇంకా సభ రెండు రోజులే జరగనుంది కావున కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ ఎంపీలకు సూచించారు.