అమరావతి, ఫిబ్రవరి 6 : రాష్ట్రాన్ని మలవిసర్జన రహితం (ఓడీఎఫ్) గా మార్చేందుకు అందరూ కృషి చేయాలనీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం ఆయన శాఖాధిపతులు, విభాగాధిపతులతో దృశ్యశ్రవణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మరుగుదొడ్ల నిర్మాణంలో అత్యంత వెనుకబడి ఉన్న జిల్లా శ్రీకాకుళం. మీరు మరుగుదొడ్లు నిర్మించుకోకపోవడం వల్ల మీకే చెడ్డపేరు వస్తోంది. దాన్ని తొలగించాలనేదే నా తాపత్రయం. అందుకే అధికారులు, ప్రజలపై ధర్నా చేసి నిరసన తెలుపుతా’ అని వ్యాఖ్యానించారు. "లక్ష్యం చేరుకునేందుకు రెండు నెలలకంటే తక్కువ సమయం ఉందని.. కలెక్టర్, అధికారులు గ్రామాల్లోనే నిద్రపోవాలని సూచించారు. మరుగుదొడ్డి కట్టుకోని వారిని భయపెట్టడం సరికాదు. వారిలో చైతన్యం తేవాలి" అని సిక్కోలు జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డికి సీఎం ఆదేశించారు.