ఇస్లామాబాద్, ఫిబ్రవరి 6 : పాకిస్తాన్ భారత్ ను ధైర్యంగా ఎదుర్కోలేక సరిహద్దులలో కవ్వింపు చర్యలు చేపడుతుంది. అంతే కాకుండా ఏదో రకంగా భారత్ ను ఇబ్బంది పెట్టాలని శతవిధాల ప్రయత్నిస్తుంది. తాజాగా చైనా నిర్మించ తలపెట్టిన చైనా- పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపెక్)ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేందుకు భారత్ ప్రణాళికలు రచిస్తోందని పాకిస్థాన్ ఆరోపణలు చేస్తోంది. సీపెక్ రూట్లో దాడులు జరిగే అవకాశముందని హెచ్చరిస్తూ పాక్ హోం మంత్రిత్వ శాఖ.. గిల్గిత్-బాల్టిస్థాన్ హోంశాఖకు లేఖ రాసిందట. ఈ మేరకు పాక్లో ప్రముఖ మీడియా డాన్ ఆన్లైన్ సోమవారం వెల్లడించింది. సీపెక్ ప్రాజెక్ట్ విషయంలో భారత్- చైనా మధ్య ఇప్పటికే భేదాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని అవకాశంగా తీసుకున్న దాయాది దేశం ఇటువంటి బూటకపు ఆరోపణలు చేస్తుంది. చైనాలోని కష్గర్ నుంచి పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో గల గ్వాడార్ పోర్ట్ను రోడ్డు, రైలు మార్గం ద్వారా ఈ సీపెక్ అనుసంధానం చేస్తుంది. చైనా చేపట్టిన ఒకే బెల్టు-ఒకే రోడ్డులో సీపెక్ ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యం ఉంది.