అమరావతి, ఫిబ్రవరి 4 : బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు తెదేపా పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాల్లో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బడ్జెట్లో ఏపీ రాష్ట్ర౦ ప్రస్తావనే రాకపోవడం చాలా బాధాకరమన్నారు. కనీసం మిత్రపక్షంగానైనా ఏపీని గౌరవించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో పోరాడాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ కోరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రాజ్నాథ్ సింగ్ నుంచి ఫోన్ రావడంతో తెదేపా తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు సమాచారం.