కర్నూల్, ఫిబ్రవరి 4 : ఓ లారీ ఎదురుగా వస్తున్న ఎద్దుల బండిని ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం బలపనూరు సమీపంలో చోటు చేసుకుంది. ఉప్పరి సుబ్బరాయుడు అనే వ్యక్తి అతని భార్య నాగలక్ష్మి, వారి ఇద్దరు కూతుళ్లతో కలిసి పొలం పనుల నిమిత్తం ఎద్దుల బండిపై వెళ్తున్నారు. అదే సమయానికి ఎదురుగా వస్తున్న లారీ ఎద్దుల బండిని ఢీకొట్టింది. దీంతో బండిలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా.? లేదంటే అతివేగం కారణమా.? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.