మౌంట్ మాంగనీ, ఫిబ్రవరి 2: ఐసీసీ అండర్-19 - 2018 దాయాది దేశం పాకిస్తాన్ తో సెమీఫైనల్ లో ఘన విజయం సాధించిన యువ భారత్ జట్టు ట్రోఫీ కు ఒక అడుగుదూరంలో నిలిచింది. 22 రోజుల పాటుసాగిన అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ పోరు మరికొద్ది గంటల్లో ముగియనుంది. యువ జట్ల మెగా సమరంలో భారత్-ఆస్ట్రేలియాలు అమీతుమీ తేల్చుకోనున్నాయి. శనివారం ఉదయం గం. 6.30 ని.లకు మౌంట్ మాంగనీ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే మూడుసార్లు ట్రోఫీని ముద్దాడి గత టోర్నీలో చివరి ఘట్టంలో బోల్తా కొట్టిన యువ భారత జట్టు ఈసారి ఎలాగైనా కప్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక కప్లు గెలిచిన ఘనత భారత్-ఆసీస్లది. ఈ రెండు జట్లు తలో మూడుసార్లు వరల్డ్ కప్ గెలిచి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ ఫైనల్ సమరంలో ఏ జట్టు గెలిచిన కొత్త చరిత్ర సృష్టించనుంది. కాగా భారత్ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది.