అమరావతి, ఫిబ్రవరి 2 : రాష్ట్రానికి ఏంటి ఈ దురదృష్టం.. అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలపై స్పందించిన ఆయన రాష్ట్రం గురించి బడ్జెట్లో ఒక్క మాటైనా ప్రస్తావించకపోవడం బాధకరమన్నారు. "అభివృద్ధి చెందిన నగరాలకు నిర్దిష్ట కేటాయింపులు చేసి రాజధాని నగరం లేకుండా ఏర్పడిన నవ్యాంధ్ర గురించి మాత్ర౦ పట్టించుకోలేదు. అమరావతికి చిన్నపాటి కేటాయింపులూ చేయలేదు. చట్టబద్ధ హామీలు, పార్లమెంటులో ఇచ్చిన హామీల గురించి కనీసం ఊసేలేదు. నిర్దిష్ట చర్యలు లేకుంటే.. ప్రజలకు ఎలా సమాధానం చెప్పగలం? ఆ హామీలు కేంద్రానికి గుర్తున్నాయా? ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మిత్రపక్షమైనప్పటికీ మాట్లాడకుండా ఎలా ఉండగలం. రాష్ట్రం చిన్నది కావడం వల్ల ఢిల్లీకి మనం కనిపించడం లేదా" అంటూ ఆక్రోశించారు.