భద్రాచలం, జూన్ 24 : పుణ్యక్షేత్రం లోనికి మొబైల్స్ కాని కెమెరాలు కాని ఎటువంటి అనుమతి లేదన్న విషయం అందరికి తెలిసిందే. ఆలయ ప్రాంగణంలో రక్షణ సిబ్బంది తగు చర్యలు తీసుకున్నప్పటికీ భద్రాచల పవిత్ర పుణ్యక్షేత్రం రామాలయ గర్భగుడిలోని స్వామివారి మూలవరుల ఫొటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. స్వామివారి దర్శనం కొరకు ఎందరో భక్తులు భద్రాచలం చేరుకొని గర్భగుడిలోని స్వామి వారిని దర్శించుకుంటారు. కానీ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు స్వామివారి దర్శనం చేసుకోకుండా గర్భగుడిలోని స్వామివారి మూలవరుల ఫొటోలు తీసి వాట్స్ ప్ ఫేస్ బుక్ లో ప్రచారం చేశారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గర్భగుడిలో చరవాణి ప్రవేశానికి అనుమతి లేదన్న నిబంధన ఉన్న విషయం తెలిసిందే. ఆలయంలో రక్షక సిబ్బంది నిబంధన కఠినంగా ఉన్నప్పటికీ అపచారం జరిగింది. వీటితో పాటు ఎస్ పీ ఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా సీసీ కెమెరాల నిఘా కూడా ఉన్నది. ఇంత పెద్ద నిబంధనల వ్యవస్థ ఉన్నప్పటికీ స్వామివారి మూల వరుల ఫొటోలు ఎవరు తీశారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇలాంటి అపవిత్ర పనులకు పాల్పడిన వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు. తగు చర్యలు తీసుకుంటున్నప్పటికి భక్తులు ఎవరి ఇష్టానికి వారే ఆలయ సిబ్బంది నిబంధనలు లెక్క చేయకుండా గర్భగుడిలో చరవాణితో గుట్టుగా ఫొటోలు తీస్తున్నారని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. ఆ తరువాత అవి సోషల్ మీడియా ద్వారా వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే.