హైదరాబాద్, జూన్ 23 : ఇటీవల జరిగిన బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్యకు కారణమయ్యారంటూ ఆర్ జే స్టూడియో యజమాని రాజీవ్ ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తను గతంలో చేసిన కొన్ని ఆకృత్యాలు వరుసగా బయటికి రావడం మొదలయ్యాయి. రాజీవ్, శిరీషతో పాటు మరో నలుగురు యువతులతో పరిచయాలు పెంచుకోవడమే కాకుండా ప్రేమించడానికి ప్రయత్నించినట్లుగా అతని చరవాణి రికార్డుల ద్వారా సమాచారాన్ని సేకరించామని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం సాగించిన రాజీవ్ తర్వాత ఒక్కొక్కరిని దూరంగా ఉంచుతూ, వారి అశ్లీల చిత్రాలను సామాజిక మాధ్యమాలలో పంపిస్తానంటూ బెదిరించసాగాడు. ఈ విధంగా ఇద్దరిని మోసం చేసిన తరవాత వివాహమైన శిరీషను ప్రేమలోకి దింపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజీవ్ ను ప్రేమించిన తేజస్విని ఒక వైపు పోలీసుస్టేషన్ లో కేసు పెడతానని బెదిరించి, అతని తల్లిదండ్రులతో పెళ్లి విషయం మాట్లాడినందున ఆమెను దూరంగా ఉంచాలంటే ముందు శిరీషను వదిలేయాలని భావించినట్లుగా పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. యువతులతో చనువుగా ఉన్న సమయంలో వారికి తెలియకుండానే అశ్లీల దృశ్యాలను తన మొబైల్ లో చిత్రీకరించడం రాజీవ్ కు అలవాటని దర్యాప్తులో తేలిందని అతని ఫోన్ ను పరిశీలించిన పోలీసులు తెలిపారు.