శ్రీహరికోట, జూన్ 23: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ38 రాకెట్ ప్రయోగం విజయవంతైమంది. 28 గంటల నిరంతర కౌంట్డౌన్ ప్రక్రియ అనంతరం శుక్రవారం ఉదయం 9.29 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి 31 ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ప్రయోగించిన పీఎస్ఎల్వీలో మన దేశానికి చెందిన కార్టోశాట్-2ఇ(712 కిలోలు), దీని సాయంతో భూపరిశీల సామర్థ్యం మెరుగుపడనుందన్నారు. దీనితో పాటు తమిళనాడులోని నూరుల్ ఇస్లాం యూనివర్శిటీ విద్యార్థులు రూపకల్పన చేసిన ఉపగ్రహం, జర్మనీ, జపాన్, ఇటలీ సహా 14 దేశాలకు చెందిన 29 ఉపగ్రహాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. 30 నానో ఉపగ్రహాలు 243 కిలోల బరువును కలిగిఉన్నట్లు వెల్లడించారు. ఈ ఉప్రగహాలను వాహకనౌక నింగిలోకి మోసుకెళ్లి 505 కిలోమీటర్ల ఎత్తులో ధ్రువ సూర్య అనువర్తిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇస్రో పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ మిషన్తో చేసిన 17వ ప్రయోగం కావడం విశేషం. ఇస్రో ఛైర్మన్ కిరణ్కుమార్ ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ప్రయోగం విజయవంతం కావడంతో షార్ శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.