జోహెన్నెస్బర్గ్, జనవరి 29 : భారత్ క్రికెట్ జట్టు గత రెండు రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో ప్రోటీస్ జట్టుతో జరిగిన చివరి టెస్టును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా సఫారీలతో చివరి టెస్ట్ ను నెగ్గిన కోహ్లి సేన సిరీస్ వైట్ వాష్ బారి నుండి తప్పించుకుంది. కాగా ఈ సిరీస్ లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ ల్లో భారత్-దక్షిణాఫ్రికాలు ప్రతీ ఇన్నింగ్స్లోనూ ఆలౌట్ కావడంతో టెస్టు క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించబడింది. మూడు టెస్టుల్లో ఇరు జట్లు 12 సార్లు ఆలౌట్ కావడం టెస్టు చరిత్రలో ఇది తొలి సారి. విదేశీ గడ్డపై మూడు టెస్టుల సిరీస్లో భారత్ ప్రత్యర్థి వికెట్లన్నీ కుప్పకూల్చడం ఇది రెండో సారి. గతంలో 1986లో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్లో భారత్ ఆరు ఇన్నింగ్స్లోనూ ప్రత్యర్థిని ఆల్ అవుట్ చేసింది.