హైదరాబాద్, జనవరి 28 : విక్టోరియన్ సాంకేతిక విద్యాసంస్థ (వీఐటీ) తెలంగాణ మైనారిటీ విద్యార్థులకు ఉచితంగా విద్య అందించేందుకు ముందుకొచ్చింది. ఇటీవల హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి వీఐటీని సందర్శించారు. తెలంగాణ విద్యార్థులకు ఏదైనా ప్రయోజనం చేకూర్చాలని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీఐటీ ప్రతినిధులు హైదరాబాద్కు వచ్చి మంత్రి నాయినితో సమావేశమయ్యారు. తమ సంస్థల్లో మైనారిటీ విద్యార్థులకు ఉచిత౦గా విద్యను అందించేందుకు అధికారులు అంగీకరించారు. తాము ప్రస్తుతం మెల్బోర్న్, సిడ్నీల్లో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా డిగ్రీ, పీజీల్లో రూ.25 లక్షల వరకు ఖర్చవుతుండగా, ఆ మొత్తాన్ని తామే భరిస్తామని పేర్కొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వీఐటీ తీసుకున్న నిర్ణయం హర్షణీయం. దీని కోసం అర్హులైన విద్యార్థుల పేర్లను ప్రతిపాదించాలని అధికారిక ప్రతినిధులకు సూచించారు.