నెల్లూరు, జనవరి 25 : లారీని ఓవర్ టేక్ చేయబోతూ బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా మద్దురపాడు సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. విశాఖ వైపు నుండి బెంగళూరుకు వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముందున్న లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ ప్రమాదానికి గురై౦ది. ఈ ఘటనలో విశాఖకు చెందిన సామవేదం సూర్యకుమారి(65), విజయవాడకు చెందిన తాడినాడ ప్రణీత్(25), రాజమహేంద్రవరం పరిధిలోని మోరంపూడి గ్రామానికి చెందిన రామదాసు(55)లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.