జొహనెస్బర్గ్, జనవరి 24 : సఫారీలతో తుది పోరులో టీమిండియా పోరాడుతుంది. వాండరర్స్ వేదికగా భారత్- సౌతాఫ్రికా మధ్య జరుగుతున్నా మూడో టెస్ట్ లో ప్రోటిస్ బౌలర్లు పేస్ పిచ్ పై చురకత్తుల లాంటి బంతులు సంధిస్తున్నారు. టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్లు కే.ఎల్ రాహుల్ డకౌటయ్యాడు. తర్వాత మురళీ విజయ్ (8) వద్ద రబాడ బౌలింగ్ లో కీపర్ క్యాచ్ గా పెవిలియన్ కు చేరాడు. అనంతరం కెప్టెన్ కోహ్లి (54), నయావాల్ పుజారా ప్రోటిస్ బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో అర్ధ శతకం సాధించిన విరాట్ లుంగీ ఎంగడి బౌలింగ్ లో ఔటయ్యాడు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన రహనే (9) పరుగులు చేసి మోర్కెల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ జట్టు 54 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(30), పార్థివ్ పటేల్ (0) ఉన్నారు.