క్వీన్స్టౌన్, జనవరి 23 : న్యూజిలాండ్లో జరగుతున్న ఐసీసీ అండర్-19 ప్రపంచకప్లో యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఈ మెగా టోర్నీలో ప్రస్తుతం క్వార్టర్ ఫైనల్ సమరం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా బౌలర్ పోప్ ఇంగ్లాండ్ జట్టుపై ఎనిమిది వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్ ఎన్నుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లు బాంబర్, పెన్నింగ్టన్, జాక్స్ ధాటికి ఆసీస్ 33.3ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు పోప్ బౌలింగ్ దెబ్బకు 23.4ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలిపోయింది. ఈ విజయంతో ఆసీస్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ లెగ్ స్పిన్నర్ పై ఆ దేశ మీడియా ‘మరో షేన్ వార్న్ వచ్చేశాడు’ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తుంది.