న్యూ ఢిల్లీ, జూన్ 22 : మానస సరోవరం యాత్రకు వెళ్లిన సుమారు 1000 మంది యాత్రికులు అక్కడి వాతావరణం సహకరించక పోవటంతో అక్కడే చిక్కుకుపోయారు. తిరుగు ప్రయాణంలో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో సెమికోస్ట్ వద్ద చిక్కుకున్న వారిలో తెలుగు యాత్రికులకు సంబంధించిన విశాఖ జిల్లా సహా పలువురు యాత్రికులు ఉన్నట్లు వెల్లడైంది. అక్కడి వాతావరణం సహకరించకపోవడంతో ఇతర ప్రయాణికులు ప్రమాదంలో పడకుండా ముందు జాగ్రత్తగా ప్రకటన చేశారు. సెమికోస్ట్ నుంచి నేపాల్ గంజ్ వరకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మేరకు వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ సేవలను సైతం అధికారులు నిలిపివేశారు. దీంతో మూడు రోజులుగా తెలుగు యాత్రికులు అక్కడే ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని ప్రైవేట్ ట్రావెలర్స్ యాజమాన్యం చెబుతుంది. మొబైల్ఫోన్లు సైతం పనిచేయకపోవడంతో యాత్రికులు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. వారి సమాచారం తెలియకపోవడంతో యాత్రికుల కుటుంబాలు, బంధువుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీంతో ప్రభుత్వాలు స్పందించి తమకు సహకరించాలని యాత్రికులు, బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.